ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరి పల్లికి చెందిన గుడ్ల సౌమ్య ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మే 27న మరణించారు. సౌమ్య మృతదేహాన్ని యాదగిరిపల్లికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వంతో కృషి చేశారు.

ఆదివారం రాత్రి సౌమ్య మృతదేహం యాదగిరి పల్లికి చేరుకోగానే ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం సౌమ్య నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సౌమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారపు బిక్షపతి గౌడ్, మాజి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బూడిద ఐలయ్య, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సౌమ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కాలనీ ప్రజలు ఉన్నారు.