
ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకనగర్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చిలకానగర్ లో నివాసముంటున్న వంగరి రమాదేవికి.. ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు.. భర్త చనిపోగా, కొడుకు శివ శంకర్ డాక్స్ గ్లోబల్ హై స్కూల్ ని సొంతంగా నడిపిస్తున్నాడు. అయితే, కొడుకు శివ శంకర్ తల్లి రమాదేవి ఆస్తిని బలవంతంగా తన పేరుపై రాయించుకుని ఇంటి నుంచి బయటకు గెంటి వేయడంతో ఆమె ఇంటి ముందు నిరసనకు దిగింది.
కాగా, దీనితో ధిక్కుదోచని స్థితిలో ఉన్న రమాదేవి ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లి పోయింది. ఆరోగ్యం బాగోలేక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్న రామదేవిని ముగ్గురు కూతుళ్లు తమ ఇంటికి తీసుకెళ్లారు. ఇక, తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు శివశంకర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కొడుకు శివ శంకర్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.