Sunday, March 22, 2026
Home » ఏపీ హాట్ హాట్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఏపీ హాట్ హాట్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



  • ప్రకంపనలు సృష్టిస్తున్న కేసులు
  • కోర్టుల చుట్టూ అధికార, ప్రతిపక్షాలు
  • చంద్రబాబు అరెస్టుపై జాతీయ స్థాయిలో చర్చ
  • వైసీపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న పార్టీలు
  • చంద్రబాబుతో పవన్, బాలకృష్ణ, లోకేశ్ ములాఖత్
  • ఈసారి కలిసి పోటీ చేసిన జనసేనాని ప్రకటన
  • సీఎం జగన్ , సాక్షి ఎండీ భారతికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ముద్ర, తెలంగాణ బ్యూరో: మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి. వీరిలో ఒకరు ప్రతిపక్షంలో ఉంటే మరొకరు అధికారపక్షంలో ఉన్న నేతలు. ప్రస్తుతం వీరిరువురూ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం దేశ రాజకీయాల కోసం కుదిపేస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్స్కాములో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టు మెట్లెక్కారు. ప్రభుత్వ పథకాల సమాచారంతో పాటు ఎక్కువ రీచ్ ఉండే పత్రికను కొనాలంటూ వలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. రెండొందల చొప్పున ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఈనాడు పిటిషన్ వేసింది. దానిని కోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదలాయించింది. దీంతో గురువారం సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి, సాక్షి ఎండీ భారతీరెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపడం రాజకీయ చర్చకు దారి తీసింది. చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీల నేతలతో పాటు మమతా బెనర్జీ, ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ కూడా స్పందించారు. చంద్రబాబు అరెస్టును రాజకీయ కక్షపూరిత చర్యగా అభివర్ణించారు. మొన్నటి వరకు సైలెంటుగా ఉన్న బీజేపీ సైతం బాబుకు మద్దతుగా ప్రకటనలు చేసింది. ఆ పార్టీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం చంద్రబాబు అరెస్టును ఖండించారు.

టీడీపీతో జనసేన పొత్తు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికలలో జనసేన, టీడీపీ పోటీ చేయనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ములాఖత్ అయ్యారు. అనంతరం రాజమండ్రి జైలుకు కొద్ది దూరంలో బస చేస్తున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని పవన్, బాలకృష్ణతో కలిసి పరామర్శించారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన పవన్ చంద్రబాబుతో ములాఖత్ ఏపీకి చాలా కీలకమైందని చెప్పారు. వైసీపీ దౌర్జన్యాలను దోపిడి, అరాచకాలను ఎదుర్కోవాలంటే, విడివిడిగా పోటీ కుదరదని అన్నారు. ఇలా చేస్తే 20 యేళ్లైనా ఈ అరాచకం కొనసాగుతూనే ఉంది. తనను కూడా ఏపీలో అడుగుపెట్టకుండా ప్రయత్నించారని. ఈ విషయం బీజేపీ పెద్దలకు కూడా చెప్పనన్నారు. ఏపీలో పొత్తుపై అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు.

విచారణ వాయిదా

చంద్రబాబు బెయిల్ కోసం విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ఆయన న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు, ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. చిత్తూరు జిల్లా అంగళ్లలో చోటుచేసుకున్న ఘటనలో పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఈరోజు విచారణకు రాగా, ఈ కేసును వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడు పిటిషన్ విచారణ ఈ నెల19న ఉందని, అదే రోజు ఈ పిటిషన్‌ను కూడా విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఇరుపక్షాలతో మాట్లాడిన న్యాయమూర్తి తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేశారు.

సెలవులో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తరపున లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ జైలు సూపరింటెండెంట్ రాహుల్ నేటి నుండి సెలవులకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తన భార్య అనారోగ్యం దృష్ట్యా సెలవులోకి ఉండనున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఆయన స్థానంలో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఢిల్లీకి లోకేశ్, భువనేశ్వరి

చంద్రబాబు తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తన తల్లి భువనేశ్వరితో కలిసి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు అరెస్ట్‌ను ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు ఖండించడం, జాతీయ మీడియా సైతం ఈ అంశంపై దృష్టి సారించడంతో ఏపీలో ప్రస్తుత పరిణామాలు, ఇతర ప్రజాప్రతినిధులను ప్రదర్శించడం నారా లోకేష్‌ని ప్రదర్శించింది. ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని శుక్రవారం జాతీయ స్థాయిలో మీడియాకు వివరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch