ముద్ర, తెలంగాణ బ్యూరో : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం ఈరోజు ఉదయం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వారికి అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్వారుకు అర్చకులు పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించారు. ఇక సుదర్శన చక్రత్తాళ్వారును పుష్కరిణిలో పవిత్ర స్నానం తర్వాత భక్తులను పుణ్యస్నానాలకు అనుమతిస్తారు. ఈరోజు సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని, పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి నిర్వహించే ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి.