
ముద్ర,తెలంగాణ:-నగరం శివారులోని శేరిలింగంపల్లిలో అద్భుతం చోటు చేసుకుంది. భక్తులు ప్రసాదంగా సమర్పించిన పాలను అమ్మవారు తాగుతున్నారు. అదరదైన, అద్భుతమైన ఘట్టాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోచమ్మతల్లి దేవత భక్తులు సమర్పించిన పాలు తాగుతున్న అరుదైన, అద్భుతమైన ఘట్టం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మదీనాగూడలో చోటు చేసుకుంది.
మదీనగూడ గ్రామంలో శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. స్వయంభువుగా వెలసిన పోచమ్మతల్లి అమ్మవారికి ఇక్కడి స్థానికులు నిత్యపూజలు చేస్తారు. అయితే గత మూడు రోజులుగా అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు. ఇదే విషయం కమిటీ వారికి తెలుపగా శుక్రవారం ఉదయం వారు స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు. అమ్మవారు పాలను స్వీకరించినట్లు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పోచమ్మ తల్లి దేవాలయానికి బారులు తీరారు. ఉదయం నుండి అమ్మవారికి పాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ పూజలు చేస్తున్నారు.