
ముద్ర, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల పోలింగ్ ప్రారంభమయ్యింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఉప ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోటీలో 52 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వారిలో పురుష ఓటర్లు… 2 లక్షల 88 వేల 189, మహిళలు 1 లక్ష 75 వేల 645, ఇతరులు ఐదుగురు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో 1 లక్ష 66 వేల 448 మంది ఓటర్లు205 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
నల్లగొండ జిల్లాలో 80,871 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 51,560 మంది, మహిళా ఓటర్లు 29,311 మంది ఉన్నారు. వీరి కోసం 97 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 144 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 51,497 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 34,176 మంది, మహిళా ఓటర్లు 17,321 మంది ఉన్నారు. ఈ ఓటర్ల కోసం 71 పోలింగ్ కేంద్రాలు. 99 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 34,080 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 20,838 మంది, మహిళా ఓటర్లు 13,242 మంది ఉన్నారు. 37 పోలింగ్ కేంద్రాలు59 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో పట్టభద్రుల ఓటర్లు 40,106 మంది ఉన్నారు. 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట ఏర్పాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దుల్మిట్ట మండల కేంద్రాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు మండలాల్లో 4659 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 20 శాతం సిబ్బంది అదనపు అందుబాటులో ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం సీసీ కెమెరాలు ఉన్నాయి.