ముద్ర, విజయవాడ: మహిళలు, యువత, రైతులు, అన్ని వర్గాలను మెప్పించేలా ఈ దఫా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం కడపలో తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, 26న (శుక్రవారం) తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు సమాచారం. గతంలో నవరత్నాల పేరుతో ప్రకటించిన సంక్షేమ పథకాలు దాదాపుగా అమలు చేయబడ్డాయి. ఇప్పుడు దీనికి గ్రేడెడ్ వెర్షన్ గా మానిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ ప్రారంభమైంది. దీనితో పాటూ మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరుతో రాష్ట్రమంతా ఉన్నారు. ప్రజలను కలుసుకుని వారితో అన్ని విషయాలు చర్చించారు. అలాగే నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. యాత్ర కూడా ముగియనుండడం వల్ల తదుపరి ప్రచార బస్సు ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే రెండు రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.