ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డికి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వైయస్సార్ 75 వ జయంతి నేపథ్యంలో ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులు తల్లి విజయమ్మ, ఆయన భార్య భారతితోపాటు వైసిపి ముఖ్య నాయకులతో కలిసి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. వైయస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతితోపాటు ఇతర కుటుంబ సభ్యులు సమాధి వద్ద కొన్ని నిమిషాల పాటు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దివంగత వైయస్సార్ మహానేతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించిన వైయస్సార్ ఎంతగానో కృషి చేశారు ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేస్తున్నారు. తెలుగు నేల ఉన్నంత కాలం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో బతికే ఉంటారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతున్నదని అరకు ఎంపీ తనుజారాణి మీడియాతో ఏర్పాటు చేశారు. నిరుపేదలు సంతోషంగా ఉండాలని పరితపించిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, అటువంటి వ్యక్తికి ఘనంగా నివాళులర్పిస్తామని పలువురు నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్సార్ కూడా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఉన్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు
వైయస్సార్ జయంతి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘కోటాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాయి. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా కోట్లాది కుటుంబ క్షేమమే ధ్యేయంగా కృషి చేస్తాం’ అని వైయస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.