- నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను…
ముద్ర ప్రతినిధి,మేడ్చల్: అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో దేశంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ బారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పై ఈటెల 3 లక్షల91వేల 655 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోకవర్గంలో మొత్తం 37 లక్షల 79 వేల 596 మంది ఓటర్లు ఉండగా, ఈసారి ఎన్నికలలో 17 లక్షల 48 వేల ఓట్లు పోలయ్యాయి.మొదటి నుండి అందరి దృష్టిని ఆకర్షించిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానం గెలుపు కోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీగా పోరాడినా అంతిమ విజయం మాత్రం బీజేపీ అభ్యర్ధిని వరించింది.

మొత్తం 21 రౌండ్లలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో ప్రతి రౌండ్ లోనూ ఈటెల రాజేందర్ అధికారం సాధించారు.కౌంటింగ్ అనంతరం ఆయన కీసరలోని హోలీ మేరీ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారి,మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ చేతుల మీదుగా గెలుపు దృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడుతూ తనపైన ఉన్న విశ్వాసంతో ఇంత బారీ మెజారిటీతో గెలిపించిన మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలకు ఎల్లప్పుడూ రుణ పడి ఉంటానని చెప్పారు. రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఎంత వరకైనా కొట్లాడుతున్నానని చెప్పారు. మోదీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో బాగస్వామి అని హామీ ఇచ్చారు.