
ముద్ర. వనపర్తి:-ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాదులో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆడిటోరియంలో జరిగింది. ఇందులో వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎన్. శ్రీనివాస్ తెలంగాణ పర్యావరణ కార్యదర్శి, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రధాన వాణి ప్రసాద్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, పరిశ్రమలు మరియు వాణిజ్య ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయదేవ్ మరియు జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ విజయలక్ష్మి, ఎన్.ఎస్.ఎస్ అధికారి రామకృష్ణమూర్తి ఉన్నారు.
వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పచ్చదనం, పరిశుభ్రత, మొక్కల పెంపకం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పర్యావరణంపై అవగాహన, కాలుష్య నియంత్రణ వంటి పద్ధతులు విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, ఎన్. సి. సి కెడేట్లు, సిబ్బంది అందరూ తమవంతు కృషిచేస్తున్నందున ఈ అవార్డు దక్కిందని, దీనివల్ల కళాశాలకు మంచి గౌరవం దక్కిందని పేర్కొన్నారు.