రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కేంద్రంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైసిపి నిర్వాకంతో పోలవరం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల వైసిపి నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకి సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు జాప్యం కావడానికి చంద్రబాబు నాయుడే కారణమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బహిరంగ చర్చకు తాము సిద్ధమని. అదే సమయంలో పరిపాలనలో, అభివృద్ధిలో తమతో పోటీ పడాలని, గూండా గిరిలో టిడిపితో పోటీ పడలేమని భరత్ స్పష్టం చేశారు. పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. టిడిపి హయాంలో ఏం జరిగిందో, వైఎస్సార్సీపీ హయాంలో ఏం జరిగిందో చర్చిద్దామంటూ సవాల్ చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రానికి విడిచిపెట్టి ఉంటే ఇప్పటికే పూర్తయిందని స్పష్టం చేశారు. గతంలో టిడిపి ప్రభుత్వం పోలవరం విషయంలో బాగా రీతిన ఉంది. ఒక క్రమ పద్ధతిలో పనులు చేయకపోవడం వల్లే భారీ వరదలు వచ్చినప్పుడు డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతింది.
స్పిల్ వే, స్పిల్ ఛానల్, హైడ్రాలిక్ గేట్స్, లోవర్, అప్పర్ డ్యామ్లు వైఎస్ఆర్సిపి హయాంలోనే పూర్తయ్యాయి. కాపర్ డ్యామ్ జీవితకాలం మూడేళ్లు మాత్రమేనని, ఇప్పుడు నూతన డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. జగనన్న అధికారంలోకి వచ్చాక పోలవరం సవరించిన అంచనాలు రూ.55,000 కోట్ల రూపాయలకు ఆమోదించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎకరం భూమి రూ.1000 రూపాయలకు నామమాత్రపు లీజుకు తీసుకున్న మాట వాస్తవం కాదా..? అని ఈ సందర్భంగా భరత్ ప్రశ్నించారు. టిడిపి కార్యాలయాలను ఎప్పుడైనా కూలగొట్టే ప్రయత్నం చేసామా..? అని ప్రశ్నించిన భరత్.. పార్టీ కార్యాలయం కోసం హైదరాబాదులో భూమి తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ మార్చి వేసినది నిజం కాదా..? అని ప్రశ్నించారు. సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ9 ప్రసారాలను నిలిపివేయించి మీడియాపై జులుం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే శంకుస్థాపన చేశామని, పనులు పురోగతిలో ఉన్నాయి. అప్పటి శిలాఫలకాలు ధ్వంసం చేసి రెండోసారి శంకుస్థాపన చేయటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పరిపాలనలో, అభివృద్ధిలో తమతో పోటీ పడాలని, గూండా గిరిలో టిడిపితో పోటీ పడలేమని స్పష్టం చేశారు. తన కార్యాలయం వద్ద ఉన్న వాహనం కాల్చివేతపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.